రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్
షాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసి ప్రతీ ఓటరుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ మండల కేంద్రంలో బీఎల్ఏల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 3వ తేదీ వరకు సర్ ప్రక్రియ పూర్తి చేసేలా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, మండల అధ్యక్షుడు గూడుపల్లి పెంటారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్, కార్యదర్శి రాంరెడ్డి, నాయకులు రవీందర్రెడ్డి, చెన్నయ్య, రషీద్, బాలకృష్ణారెడ్డి, యాదయ్య, దయాకర్చారి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా కార్యదర్శి జగన్
మాడ్గుల: క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందూకురి జగన్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిరుపేదలు, కార్మికులకు జీవనోపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) రాష్ట కమిటీ సభ్యురాలు సైదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాష, పల్లెటి నర్సింహ, శేఖర్, మైసయ్య, రాకేశ్, వెంకట్రెడ్డి, నారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్టులో 25 నిమిషాలు పనిచేయని కౌంటర్లు
శంషాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ‘గోనవ్’ సర్వర్ బుధవారం తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల వరకు డౌన్ కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో 25 నిమిషాల పాటు ఇండిగో చెక్ఇన్ కౌంటర్లు పని చేయలేదు. దీంతో జీ, హెచ్ రో చెక్ ఇన్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. 4.55 గంటల తర్వాత ఎయిర్లైన్స్ తన సెకండరీ సర్వర్ స్కైగోకి మారి సేవలను పునరుద్ధరించింది. 5.30 గంటల తర్వాత ప్రధాన సర్వర్ కూడా మళ్లి ప్రారంభం కావడంతో ప్రయాణికులకు సంబంధించిన ప్రక్రియ సాఫీగా ముందుకు సాగిందని ఎయిర్పోర్టు వర్గాల పేర్కొన్నాయి.
రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుండి పీడీపీ చౌరస్తా వైపు వెళ్తున్న కారులో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో కారు దిగి బయటికి వచ్చాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కరుణాకర్ అటుగా వెళుతూ వెంటనే స్పందించాడు. పక్కనే ఉన్న ఇంటి నుంచి పైపును తీసుకొని మంటలను అదుపులోకి తెచ్చాడు. 20 నిమిషాల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే కారు దాదాపు 50 శాతం కాలిపోయింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజు కానిస్టేబుల్ కరుణాకర్ను అభినందించారు.


