పహాడీషరీఫ్: సైబర్ నేరాల బారిన పడకుండా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను అప్రమత్తంగా ఉపయోగించాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ సూచించారు. పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో తుక్కుగూడలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ఆర్థిక మోసాలు, ఫిషింగ్ ఎటాక్స్, నకిలీ లింక్లు, ఓటీపీ స్కామ్లు, సోషల్ మీడియా హ్యాకింగ్, ఐడెంటిటీ దొంగతనం వంటి నేరాలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తెలియని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లను షేర్ చేసుకోరాదని సూచించారు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయడం, మోసపూరిత ఫోన్ కాల్లకు స్పందించడం లాంటివి చేయరాదన్నారు. పౌరుల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనను ప్రోత్సహించేందుకు శ్రీసైబర్ మిత్రశ్రీ, శ్రీసైబర్ సింహశ్రీ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్, లేదంటే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ఆర్జీఐఏ ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్ఐలు దయాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, ఫైజల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


