షాద్నగర్: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామ పరిధిలో ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు రూ.12 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మరో రూ.8 కోట్లు మంజూరు చేయాలన్నారు. స్పందించిన మంత్రి దర్గాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందని, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం మునుగనూరులోని సర్వే నంబర్ 83లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుండడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుతూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో బోర్డు తొలగించి ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైందని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని, బోర్డును తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుద్యాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎంవో సెక్రటరీ మాణిక్కరాజ్ కన్నన్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 16 నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి కావాలని టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డికి సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. భవనాలు అందుబాటులోకి రాగానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఈలు రాజయ్య, నాగేశ్వర్ రావు, ఏఈలు జనార్దన మూర్తి, విజయభాస్కర్ రెడ్డి, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.


