కందుకూరు: జాతీయ ఉపాధిహామీ చట్టానికి పేరు మార్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చట్టాన్ని పూర్తిగా తొలగించేలా చేస్తున్న తిప్పికొట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అంకగళ్ల కుమార్ ఆధ్వర్యంలో గురువారం కందుకూరులో ఉపాధిహామీ కూలీలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ పేరుతో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి నూతనంగా వీబీ రామ్జీ 2025/197 చట్టాన్ని తేవడం అంటే రాబోయే రోజుల్లో చట్టాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నమేనన్నారు. ఎర్ర జెండా పోరాటంతో అప్పటి ప్రభుత్వం 2005లో వలసలు తగ్గించి పేదల కడుపు నింపాలనే లక్ష్యంతోనే తెచ్చిన ఉపాధిహామీ చట్టంలో పురుషులు, మహిళలు అనే తారతమ్యం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వంద రోజుల పని దినాలు కల్పించేలా అమలైందన్నారు. ఈ చట్టానికి రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్ ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.90 వేల కోట్లకు పరిమితం చేశారన్నారు. సకాలంలో కూలీ డబ్బు అందించడంలో విఫలమవుతున్నారన్నారు. కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు మస్కు అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రాంచందర్, సీఐటీయూ జిల్లా నాయకుడు బుడ్డీరపు శ్రీనివాస్, సీపీఎం మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్, పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు రాయికంటి శేఖర్, సురేష్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి


