కందుకూరు: మండల పరిధిలోని బైరాగిగూడలో ఏళ్ల నుంచి పూజలందుకుంటున్న పోతురాజు లింగంను ఈనెల 1వ తేదీన గుర్తు తెలియని దుండగులు తొలగించారు. ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసి భూమిలో పూడ్చి వేశారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు పోలీసుల సమక్షంలో పోతురాజు లింగాన్ని బయటికి తీసి యథాస్థానంలో ఉంచారు. గుప్త నిధులు కోసమే ఇదంతా జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం ధ్వంసమైన స్థలాన్ని పరిశీలించారు. పోతురాజు లింగానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువుల ఆరాధ్య దేవతలపై దాడులు చేయడం, ఆలయాలను అపవిత్రం చేయడం తదితర ఘటనలు పెరుగుతుండటం బాధాకరమన్నారు. పోతురాజు లింగాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం దారుణమన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసే ముష్కరులపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేసుకోవాలని, కారకుల్ని గుర్తించి చట్టపరంగా శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పోతురాజు లింగానికి యథావిధిగా పూజలు చేసుకునేలా రక్షణ కల్పించాలన్నారు. స్థలాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని పునఃనిర్మిచేందుకు పూర్తి సహకారం ఇస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, సర్పంచ్ పల్స కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ ఎలిమినేటి సంజీవ, వార్డు సభ్యులు భగవంత్, మంజుల, నగేశ్, లత జంగయ్య, వినోద, దేవేందర్గౌడ్, కిరణ్, ఏ.దేవేందర్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్గౌడ్, నాయకులు శివగౌడ్, నరేందర్, సురేందర్, అంజయ్య, మైసయ్య, శ్రీకాంత్, జంగయ్య, రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు సాధ మల్లారెడ్డి, గంగాపురం అమరేందర్రెడ్డి, అశోక్గౌడ్, టి.జగదీశ్వర్రెడ్డి, గౌర ప్రభాకర్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బైరాగిగూడలో పోతురాజు లింగం ఆలయాన్ని సందర్శించిన అందెల శ్రీరాములుయాదవ్


