వచ్చేసింది విత్తన పండుగ
కడ్తాల్: దేశీ విత్తనాల సంరక్షణే లక్ష్యంగా తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు అన్మాస్పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్ ముస్తాబైంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమై ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. విత్తనాలను ఎంచుకోవడం, పంచుకోవడం, పరిరక్షించుకునే చిరకాల సంప్రదాయాలను పునర్నిర్మించడంతో పాటు సంప్రదాయ విత్తన వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విత్తన పండుగకు పెద్ద ఎత్తున వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు విధాన నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తరలిరానున్నారు. మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర 14 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విత్తన నిపుణులు పాల్గొననున్నారు. ప్రదర్శనలకు 74 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జయప్రదం చేయండి
తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగను జయప్రదం చేయాలని పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి, సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, సమాచారహక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎర్త్ సెంటర్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ వేత్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంప్రదాయ విత్తన జ్ఞానాన్ని పంచుకోవడానికి, రైతుల, విత్తన సంరక్షకుల అనుభవాలను ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడానికి, పరస్పర సహకారం, సామూహిక బలాన్ని పెంచేందుకు ఈ వేడుక దోహదపడుతుందన్నారు. ప్రారంభోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, ఎంపీ మల్లురవి, వివిధ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నట్లు తెలిపారు.
నేటినుంచి 8వ తేదీ వరకు..
అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్ వేదిక
పలు రాష్ట్రాలకు చెందిన దేశీ విత్తనాల ప్రదర్శన
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు


