● వన నర్సరీల్లో నిరుపయోగంగా
4 లక్షల మొక్కలు
హనుమంతునిపాడు: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు పచ్చదనానికి గొడ్డలిపెట్టుగా మారాయి. వానలు ముఖం చాటేయడంతో హనుమంతునిపాడు, హాజీపురం అటవీ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచిన సుమారు 4 లక్షల మొక్కలు పంపిణీకి నోచుకోక అక్కడే ఉండిపోయాయి. నర్సరీల్లో ఎర్రచందనం, టేకు, నేరేడు, మామిడి తదితర పండ్ల, అటవీ జాతి మొక్కలను లక్షలు వెచ్చించి పెంచారు. వర్షాలు లేకపోవడంతో పొలం గట్లు, కుంటలు, రోడ్లకిరువైపులా నాటాల్సిన ఈ మొక్కలన్నీ నర్సరీలకే పరిమితమయ్యాయి. సమయం మించిపోతుండటంతో మొక్కలు పరిమితికి మించి పెరిగిపోతున్నాయి. వాటిని మరో కవర్లోకి మార్చి పెట్టే క్రమంలో వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.


