● పిల్లలను విధిగా బడులకు పంపించండి ● సంచార జాతుల అవగాహన సదస్సులో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: సంచార జాతుల వారు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలను విధిగా బడులకు పంపించాలని కలెక్టర్ పి .రాజాబాబు సంచార జాతుల వారిని కోరారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సంచార జాతుల వారు వారి పిల్లలను ఏ బడిలోనైనా చేర్పించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, సంచార జాతులు వారి సమస్యల సాధనకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, హెల్త్ కార్డులు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు వంటివి విధిగా ఉండాలని అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతులైన, జంగం, మొండి బండ, పాముల, బుడబుక్కల తదితర కులాల నుండి మౌనిక, లలితమ్మ, వెంకటమ్మ, శ్రీనివాసరావు, లక్ష్మ, చిన్నమ్మ తదితరులు తమ తమ సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముప్పూరి వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు పొగడ్తలచిన్న చెంచయ్య, జంగమ సంఘం అధ్యక్షుడు ముసునూరి కోటేశ్వరరావు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య, సంచారజాతుల జిల్లా సంఘం అధ్యక్షుడు పొగడ్తల వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షుడు చిన్నకత్తుల రాజేష్, పాముల సంఘం అధ్యక్షుడు దాయాది, కార్యదర్శి నాగులూరి సామ్యూల్ పలువు సంచర జాతులు వారు పాల్గొన్నారు.


