
తణుకు(ప.గో.జిల్లా): సంపద సృష్టించి పేదవాడికి పంచుతామన్న చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, జూలై 6) తణుకులో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూరితో పాటు, నరసాపురం వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణం రాజు, వైఎస్సార్సీపీ కన్వీనర్ గూడూరి ఉమా బాల, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
దీనిలో భాగంగా కారుమూరి మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు పాలనతో ప్రజల్లో ఇప్పటికే విసుగు మొదలైంది. మంచం మీద పడుకున్న ముసలమ్మ నొక్కిద్ది బటన్ విశేషమా అన్నారు... ఇప్పుడు ఆ బటన్ నొక్కలేక పోతున్నారు. సంపద సృష్టించి పేదవాడికి పంచుతా అన్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తా అన్నారు.. మర్చిపోయారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు దానిని p4కు మార్చేశామంటున్నారు
నిరుద్యోగ భృతి అడిగితే స్కిల్ డెవలప్మెంట్లో కలిపేశాం అంటున్నారు. లోకేష్ గాని చంద్రబాబు గానీ పీఫోర్లో ఎంత ఇచ్చారు తమ నియోజకవర్గాల్లో. వారి సొంత డబ్బు ఒక్క రూపాయిఅయినా ఇచ్చారా..?, ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామాలాడుతున్నారు. సంవత్సర కాలంలో 1 లక్ష76 వేల కోట్లు అప్పు చేశారు. ఈవీఎంల తో మోసం చేసి గెలిచారు.
జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసం చేయలేదు కూటమినేతల్లా వెన్నుపోట్లు పొడవ లేదు. పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఓట్లు వేసిన వారికే కాదు వేయనివారికి సైతం మేలు చేయామని మా నాయకుడు జగన్ చెప్పారు. ైఎస్ఆర్ సీపీకి వారికి పథకాలు ఇవ్వద్దు అని అంటున్నారు చంద్రబాబు.. ఆయన బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నారా...?, ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ముందు.. అనేక వాగ్దానాలు చేశారు.. ఎన్ని నెరవేర్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు.