రానున్న మూడ్రోజులూ రాష్ట్రంలోభిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న మూడు రోజులూ ఓ వైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకస్మిక వర్షాల సమయంలో పడే పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


