సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని కోట మండల ఎంపీపీ ఉపఎన్నికలో టీడీపీ బరితెగింపు రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి కౌన్సిల్ హాల్లో బలవంతంగా పార్టీలోకి లాక్కుంది. ఈ క్రమంలో పచ్చ పార్టీ బెదిరింపులపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాసామ్య ఎన్నికను వైఎస్సార్సీపీ బాయ్కాట్ చేసింది.
అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘కోట ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ దిగజారుడు రాజకీయం చేసింది. వైఎస్సార్సీపీ బీఫామ్తో గెలిచింది 14 మంది, టీడీపీ తరఫున గెలిచింది నలుగురు. మా పార్టీ ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ కండువా కప్పి తీసుకొని వస్తారా?. వెన్నుపోటు రాజకీయాలు చేయడం టీడీపీకి మొదటి నుండి అలవాటే. పార్టీకి నమ్మక ద్రోహం చేసిన, పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీలకు భవిష్యత్తులో బుద్ధి చెబుతాం. పార్టీ కోసం నిలబడ్డ ఎంపీటీసీలకు అండగా ఉంటాం.
చంద్రబాబు నీచ రాజకీయాలు మరొకసారి కోటలో బయటపడ్డాయి. నాలుగు నెలల ఎంపీపీ పదవి కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. నేరుగా ప్రజల మద్దతుతో గెలిచే ధైర్యం లేక అడ్డదారులు తొక్కారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్పే సమయం వస్తుంది అని హెచ్చరించారు.


