పేరులో అన్నం.. నోట్లో అశుద్ధం! | Sakshi
Sakshi News home page

పేరులో అన్నం.. నోట్లో అశుద్ధం!

Published Fri, Sep 17 2021 2:48 AM

YSR Congress Party Leaders Fires On TDP Leader Ayyannapatrudu - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన దుర్భాషలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. జోగి రమేష్, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం వారు మాట్లాడుతూ.. టీడీపీకి చెందిన ఈ వెధవకు సీఎం జగన్‌ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. అయ్యన్నపాత్రుడు పేరులో అన్నం ఉంది గానీ.. నోట్లో ఉన్నదంతా అశుద్ధమేనని విరుచుకుపడ్డారు.

ఈ రోజు నుంచి అయ్యన్నను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం పోయిందని రగిలిపోతున్న ఈ గాడిద గురించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నీచంగా చెబుతారన్నారు. పొద్దున లేస్తే అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చేసేదే గంజాయి వ్యాపారమని, ఇది గత రెండున్నరేళ్లుగా బంద్‌ అయ్యేసరికి అయ్యన్న గాడిదలాగా మారి అరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతకాయల రూ.కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. ఆయన, చంద్రబాబు అవినీతిని ప్రభుత్వం బయటపెడుతున్నందుకే దూషణలకు దిగుతున్నాడని ధ్వజమెత్తారు.

చంద్రబాబు లోకేశ్‌ డైరెక్షన్‌ మేరకే చింతకాయల విమర్శలకు దిగారన్నారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే, నిజంగా మనిషి అయితే మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు కారణమో, కాదో చెప్పాలన్నారు. కోడెలను చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని తెలుగు ప్రజలు కోడై కూస్తున్నారని తెలిపారు. అయ్యన్న తిట్టాల్సింది.. చంద్రబాబును, లోకేశ్‌నేనని చెప్పారు. నర్సీపట్నం ప్రజలు అయ్యన్న వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నారన్నారు. హైకోర్టు.. తన తీర్పుతో చంద్రబాబు, లోకేశ్‌లను చాచి లెంపకాయ కొట్టిందని.. దాన్ని మళ్లించడానికే ఇలా దూషణలకు దిగాడన్నారు.    

Advertisement
Advertisement