రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు: వైఎస్‌ షర్మిల

YS Sharmila fires on CM KCR at Kamareddy District Padayatra - Sakshi

బిచ్కుంద (జుక్కల్‌): మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ పేరుతో కొల్లగొట్టి తన జేబులు నింపుకొన్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను ఆగం చేశారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మద్నూర్, నస్రుల్లాబాద్‌ మండలాల మీదుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.38 వేల కోట్లకు పూర్తి చేయాలనుకున్నారని, అదే ప్రాజెక్టును కేసీఆర్‌ రీడిజైన్‌ చేయించి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష 20 వేలకు పెంచి రూ.70 వేల కోట్లను మింగారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ ఏనాడూ సీఎం కేసీఆర్‌ అవినీతిపై నిలదీయలేదని, రెండు పార్టీలూ తమ స్వార్థం చూసుకుంటున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాçష్ట్ర అధికార ప్రతినిధి పిట్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్‌.సుధాకర్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top