సాక్షి, తాడేపల్లి: ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన దారుణమైన రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఓట్ల తొలగింపుతోనే ఆగిపోలేదని, రాష్ట్రంలో కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలకు తెరలేపిందని జగన్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని, అధికార పదవుల్లో ఉన్నవారే దళితులు, దళిత క్రైస్తవులు, ఇతర బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. "హే రామ్.. సేవ్ ఆంధ్రా" అంటూ పిలుపునిచ్చారు.
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని జగన్ గుర్తుచేశారు. ఈ అంశంపై జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మతాన్ని రిజర్వేషన్లతో ముడిపెట్టడం సరికాదని అసెంబ్లీలో తీర్మానం చేశామని, అదే అంశంపై జస్టిస్ బాలకృష్ణన్ కమిటీకి కూడా అధికారికంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. "చేతనైతే ప్రజలకు మంచి చేయండి.. విద్వేషాలను మాత్రం రెచ్చగొట్టొద్దు" అంటూ చంద్రబాబుకు వైఎస్ జగన్ హితవు పలికారు.


