జూదం చట్టబద్ధమా? | YS Jagan Express Concern Over Kutami Corruption | Sakshi
Sakshi News home page

జూదం చట్టబద్ధమా?

Jan 22 2026 1:30 PM | Updated on Jan 23 2026 5:10 AM

YS Jagan Express Concern Over Kutami Corruption

చంద్రబాబు సర్కారుపై వైఎస్‌ జగన్‌ మండిపాటు 

సంక్రాంతి రోజు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపించారు 

జూదాల్లో రూ.2 వేల కోట్లు చేతులు మారాయి 

బాబు, ఎమ్మెల్యేలు, పోలీసులు వాటాలు పంచుకున్నారు

సాక్షి, అమరావతి: ‘జూదం అనేది చట్టబద్ధమా..?’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ దగ్గరుండి జూదాలు (గ్యాంబ్లింగ్‌) నడిపించారని.. ఈ వ్యవహారంలో రూ.2 వేల కోట్లు చేతులు మారాయని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇందులో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసులు కూడా వాటాలు పంచుకున్నారని ఆరోపించారు.

ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏమిటని నిలదీశారు. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా..? ఇది అవినీతి కాదా..? ఇది లూటీ కాదా..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌... విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పారు.  

ఇవన్నీ అవినీతి కాదా..? 
కళ్ల ముందు టీడీపీ కూటమి నేతలు చేస్తున్న అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము నిజాయితీపరులమనే భ్రమను కల్పించే యత్నాలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, వాడవాడనా బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. పర్మిట్‌ రూమ్‌లు వెలిశాయి. వాటిలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతూ దోచుకుంటున్నారు. ఇది అవినీతి కాదా? ఇసుక అమ్మకాలతో వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక అని మభ్యపెడుతూ ఎడాపెడా దోచేస్తున్నారు. నాటికీ, నేటికీ ఇసుక ధర చూస్తే రెట్టింపు అయ్యింది. ప్రభుత్వ ఖజానాకు పైసా ఆదాయం రావడం లేదు. దోచేస్తున్న డబ్బు అంతా చంద్రబాబు, టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇది అవినీతి కాదా? ఇసుకే కాదు.. సిలికా, క్వార్ట్‌ ్జలేటరైట్‌ లాంటి సహజ వనరులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తూ టీడీపీ మాఫియా దోచుకుంటోంది. 

ఇది అవినీతి కాదా..? మా హయాంలో విద్యుత్‌ యూనిట్‌ అత్యంత చౌకగా రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తే చంద్రబాబు రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు యూనిట్‌ రూ.4.60 వంతున కరెంట్‌ కొనుగోలు చేస్తున్నారు. రూ.2.49 ఎక్కడ..? రూ.4.60 ఎక్కడ..? ఇది అవినీతి కాదా..? అమరావతిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్నది ఏమిటి..? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? చదరపు అడుగుకు రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు ఖర్చు చేస్తున్నారు. 

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.. రాజధాని నిర్మాణంలో జరుగుతోంది అవినీతి కాదా..? ఈ అవినీతిపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

బాబు సర్కారు అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తామనే భయంతోనే.. 
అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ సభ్యులు హాజరవడంపై అనేక సందర్భాల్లో గతంలోనే స్పష్టమైన సమాధానాలు చెప్పానని మరో ప్రశ్నకు జవాబుగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ‘అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు.. ఒకటి అధికారపక్షం.. రెండోది ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ. మరి.. వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా స్పీకర్‌ను అడ్డుకుంటున్నదెవరు? 

ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, సభా నాయకుడికి మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంత సమయం నాకూ ఇవ్వాల్సి వస్తుంది.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తాననే భయంతోనే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు జంకుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా 175 మంది ఎమ్మెల్యేల తరహాలోనే కేవలం 5 నిమిషాలే సమయం ఇస్తామంటే ప్రజల గొంతును వినిపించే అవకాశం ఉండదు. ప్రజల గొంతుకను బలంగా వినిపించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది..’ అని వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement