దస్తగిరిది ఎంత క్రిమినల్‌ మైండ్‌ అంటే.. | YS Viveka Murder Case: Devireddy Chaitanya Reddy On Dastagiri Allegations, Know Details Inside - Sakshi
Sakshi News home page

దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు

Mar 2 2024 2:20 PM | Updated on Mar 2 2024 3:42 PM

Viveka Case: Devireddy Chaitanya Reddy On Dastagiri Allegations - Sakshi

హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్‌ కోసం వెతికామని దస్తగిరి చెప్పడంలోనే అసలు.. 

వైఎస్సార్‌, సాక్షి: వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుకా పెద్ద కుట్ర దాగి ఉందని.. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడని అంటున్నారు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనయుడు డా.చైతన్యరెడ్డి. ఈ కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలపై.. దస్తగిరి చేసిన ఆరోపణలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.  

దస‍్తగిరి ఎవరి డైరెక్షన్‌లో మాట్లాడుతున్నాడో అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పడం.. సునీత చెప్పడం.. దస్తగిరి ఆరోపణలు చేయడం. ఈ డ్రామాలు, కథలు ఇప్పటివి కాదు. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడు. దస్తగిరి అంత క్రిమినల్‌ మైండ్‌ ఎవరికీ లేదు. ఇదంతా మా నాన్న(శంకర్‌రెడ్డి) బెయిల్‌ పిటిషన్‌ కోర్టులో నడుస్తుందనే చేస్తున్నారు. నా తండ్రిని చెయ్యని తప్పుకి రెండున్నరేళ్లు జైల్లో ఉంచారు. ఆయనకు బెయిల్‌ రాకుండా ఉండేందుకే కట్టుకథలు అల్లుతున్నారు. ఒకవేళ వాళ్లు అనుకున్నట్లు బెయిల్‌ తిరస్కరణకు గురైతే.. మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఏమీ ఉండవు.. 

దస్తగిరి అప్రూవర్‌గా మారడంలోనూ కుట్ర దాగుంది. హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్‌ కోసం వెతికామని దస్తగిరి చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైనా పారిపోవాలని చూస్తారుగానీ.. డాక్యుమెంట్స్‌ కోసం వెతుకుతారా?. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా కిందపడి రక్తపు వాంతులతోనే వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారు. హత్య తరువాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.

హత్య జరిగిన నాడు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్‌లో యాక్టీవ్‌గా ఉన్నారని అరోపిస్తున్నారు. అది ఎన్నికల టైం. ఒక ఎంపీగా ఆయనకు సవాలక్ష మెసేజ్‌లు వచ్చి ఉంటాయి. మరి అంతకు ముందెప్పుడు ఆయన అలా వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారో? లేదో? చూడండి. ఈ విషయాలన్నింటి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని వివేకా కూతురు సునీత ఎందుకు ప్రశ్నించరు?.

‘‘నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. అక్కడ ఉండేవాళ్ల ఆరోగ్య పరీక్షల నిమిత్తమే వెళ్లా. నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. పైగా జైల్లో ప్రతీ చోటా సీసీ కెమెరాలు ఉంటాయి. క్యాంపులో నాతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే.. సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని కదా!. మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి?.. అని చైతన్య పశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement