
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు.
కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ఖరారయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఇక, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు చేయగా.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ,వివేక్ ,అడ్లూరి లక్ష్మణ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ముగ్గురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు.. హైదరాబాద్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించిన ప్రభుత్వం. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు. ఆదివారం ఉదయమే ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ప్రోటోకాల్ అధికారులు రాజ్భవన్ చేరుకున్నారు.
హైకమాండ్ కసరత్తు..
ఇక, మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం చెప్పినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టంచేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.

చర్చల అనంతరం..
గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించింది. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరెవరికి చోటు కల్పించాలో నిర్ణయం చెబుతామన్న అధిష్ఠానం శనివారం తన అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం.
అనంతరం పార్టీకి సంబంధించిన పలువురు నాయకులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. నాలుగో పేరును ప్రస్తుతానికి పక్కనపెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితోపాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు.