టీడీపీ తీరు రాబందులను గుర్తుచేస్తోంది

Shilpa Ravichandra Kishore Reddy Comments On TDP - Sakshi

 నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి 

నంద్యాల: అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేయడం నీచం, దారుణమని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు.  బుధవారం నంద్యాలలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య వ్యవహారంలో టీడీపీ నాయకుల హడావుడి, తాపత్రయం చూస్తుంటే రాబందులు గుర్తుకొస్తున్నాయన్నారు. సలామ్‌ కుటుంబం మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి ఐపీఎస్‌ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని, 24 గంటల్లోనే నిందితులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయించారని గుర్తు చేశారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేíÙయా కూడా ప్రకటించారన్నారు. సలామ్‌ కుటుంబానికి మొట్టమొదట ధైర్యం ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగనేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుంటే మరో పక్క చంద్రబాబు, అచ్చెన్నాయుడు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రామచంద్రరావుతో బెయిల్‌ పిటిషన్‌ వేయించి డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని దుయ్యబట్టారు. అబ్దుల్‌ సలామ్‌ ఆత్మహత్య కేసులో బెయిల్‌ ఇప్పించడంపై ప్రజలకు చంద్రబాబు, అచ్చెం, లోకేష్లు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళిత న్యాయవాది సుబ్బరాయుడును హత్య చేస్తే టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదన్నారు. గుంటూరులో ముస్లిం యువకులు న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని, దీన్ని ఎవరూ మరచిపోలేదని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top