నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన

Rahul Gandhi Chief Minister Works For Adani Gaffe BJP Trolls Him - Sakshi

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరు జారారు. అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి  సూచించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు కురిపించింది. అదాని వంటి పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని చివరకు రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ మండిపడింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. బీజేపీ ధనవంతులకు సేవ చేస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూపును ప్రస్తావిస్తూ కేంద్రం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. అదే క్రమంలో అదానీ కోసం పనిచేయాలని భూపేష్ భగేల్‌కు కూడా సూచించారు.

"బీజేపీ అదానీ ప్రయోజనాల కోసం 24X7 సేవ చేస్తోంది. బీజేపీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసం పనిచేస్తున్నారు. కానీ మేము రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పని చేస్తున్నాము. ఇదే తేడా" అని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ ప్రసంగం సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పదవిలో ఉన్న భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అటు.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ అందిపుచ్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం అదానీ గ్రూప్‌ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ ఒప్పుకున్నారని బీజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాలవీయ అన్నారు.

ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top