
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక, జూలై ఒకటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది.
కాగా, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకి నోటిఫికేషన్ విడుదల కానుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై ఒకటో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన చేస్తారు. అయితే, తెలంగాణ బీజేపీ ప్రముఖంగా ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని సారథ్య బాధ్యతలు వరించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం వరకు కొత్త అధ్యక్షుడి అభ్యర్థికి అధిష్టానం సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటరు జాబితా రెడీ అయ్యింది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్ వేయాలా వద్దా అనేదానిపై తర్వాత నిర్ణయించుకుంటానని రాజాసింగ్ తెలిపారు.
అయితే, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణాలు, వడపోతల తర్వాత.. చివరగా రేసులో ఇద్దరే ఇద్దరు నేతలు మిగిలారు. వాళ్లే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్. అధ్యక్ష పదవిపై బయటికి చెప్పకపోయినప్పటికీ.. పార్టీలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు.
ఈటల Vs అరవింద్..
బీజేపీ పార్టీకి విధేయుడిగా ధర్మపురి అరవింద్కు గుర్తింపు ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్షాకు సన్నిహితుడిగాను ఆయన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. మిగతా నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్ను తీసుకుంటే.. తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా ప్రజాదరణ ఉంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్టానం ఇచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూలమైన అంశమే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో, కొత్త నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది.