ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం | Political Leaders Condolence To Dharmapuri Srinivas Death | Sakshi
Sakshi News home page

ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల సంతాపం.. లైవ్‌ అప్‌డేట్స్‌

Jun 29 2024 8:57 AM | Updated on Jun 29 2024 12:58 PM

Political Leaders Condolence To Dharmapuri Srinivas Death

ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల సంతాపం లైవ్‌ అప్‌డేట్స్‌.. 

కేసీఆర్‌ సంతాపం..
👉ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేటీఆర్‌ సంతాపం..
👉రాజకీయాల్లో అజాత శత్రువు ధర్మపురి శ్రీనివాస్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన చనిపోవటం బాధాకరమైన విషయం. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

👉ధర్మపురి శ్రీనివాస్‌  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్

సీఎం రేవంత్‌ సంతాపం.. 
👉ధర్మపురి శ్రీనివాస్‌ పట్ల సీఎం రేవంత్‌ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం..
👉 ఈరోజు చాలా బాధాకరమైన రోజు. శ్రీనివాస్‌కు కాంగ్రెస్ అంటే ప్రాణం. మాలాంటి ఎంతోమంది ఎదుగుదలకి ధర్మపురి శ్రీనివాసే కారణం. డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తన్నాం. 

👉కాంగ్రెస్‌ నేతల నివాళులు..
కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డీఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 

పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్‌ సేవలు గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్​, వారి కుటుంబసభ్యులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డీఎస్‌ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వి.హనుమంతరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్​ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డీఎస్ గొప్ప నాయకునిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పని చేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్టిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.

👉కిషన్‌ రెడ్డి సంతాపం..
ధర్మపురి శ్రీనివాస్‌ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది.
శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బీజేపీ ఎంపీ అరవింద్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

👉డీఎస్‌ మృతి బాధాకరం: డీకే అరుణ
డీఎస్‌ తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ఓదార్చిన డీకే అరుణ. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా డీఎస్‌ చేసిన సేవలు మరువలేనివి. శ్రీనివాస్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. 

👉డీ శ్రీనివాస్‌ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే, నారా లోకేష్‌ కూడా సంతాపం ప్రకటించారు. 

👉తెలంగాణలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement