Political News: బయటపడ్డ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ డ్రామాలు

Pawan Kalyan Political Dramas In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం, సత్యసాయి జిల్లా: టీడీపీ పాలనలో రైతు ఆత్మహత్యలపై నోరు మెదపని పవన్‌ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ పేరుతో ఇప్పుడు రాజకీయ డ్రామాలకు తెర తీశారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాజకీయ లబ్ధి కోసమే పవన్‌ పర్యటనలు చేస్తున్నారని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల..

ఆత్మహత్య చేసుకున్న ఒక్కొ రైతు కుటుంబానికి రూ. 7 లక్షల చొప్పున వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 మందికి రూ.11.95 కోట్లు పంపిణీ చేసింది. గతంలో 110 మంది రైతు కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఎగొట్టారు. టీడీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచింది.

ఎవరిని ఉద్దరించేందుకు వస్తున్నారు? 
‘అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల మేర ఆర్థిక సాయం అందించింది. చివరకు టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలనూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఆదుకున్నారు. బాధిత కుటుంబాలు గౌరవంగా బతుకుతున్నాయి. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఆదుకునే పేరుతో అల్లరి చేసేందుకే వస్తున్నట్లు ఉన్నారు’’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే పేరుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌  కొత్తచెరువుకు చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం వస్తుండగా.. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్పందించారు. రైతు రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటే 17 రోజుల్లోనే రూ.7 లక్షలు అందించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు పవన్‌ పర్యటన ఎవ్వరిని ఉద్దరించేందుకని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించలేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top