
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. ప్రజలకు వరాలను ప్రకటిస్తున్నాయి. బీహార్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ భారీ ప్లాన్తో హామీలు ఇస్తున్నారు. తాజాగా ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. బీహార్లో 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు వస్తే డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదని ఆఫర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఇది అమలులోకి వస్తుందని నితిశ్ చెప్పుకొచ్చారు.
సీఎం నితీశ్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా మరో పథకాన్ని ప్రకటించారు. ట్విట్టర్లో నితిశ్..‘బీహార్ ప్రజల అవసరాల కోసం మేం మరో పథకాన్ని తీసుకువస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ చార్జీలు అందుబాటు ధరల్లోనే ఇస్తున్నాం. దీనిపై ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాం. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు కరెంట్ వాడుకుంటే.. వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
అంటే, జూలై బిల్లులను కూడా కట్టనక్కర్లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించాం. బీహార్లో 10వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంకుటీర్ జ్యోతి పథకం కింద.. అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం’ అని వెల్లడించారు. దీంతో, ఈ పథకంపై బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. బీహార్ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం అన్ని పార్టీ ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇక, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నీతీశ్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
हमलोग शुरू से ही सस्ती दरों पर सभी को बिजली उपलब्ध करा रहे हैं। अब हमने तय कर दिया है कि 1 अगस्त, 2025 से यानी जुलाई माह के बिल से ही राज्य के सभी घरेलू उपभोक्ताओं को 125 यूनिट तक बिजली का कोई पैसा नहीं देना पड़ेगा। इससे राज्य के कुल 1 करोड़ 67 लाख परिवारों को लाभ होगा। हमने यह…
— Nitish Kumar (@NitishKumar) July 17, 2025