గ్రూప్‌–1 పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలి | MLC Kavitha Open Letter To CM Revanth Over Group 1 Recruitment: Telangana | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలి

Apr 19 2025 5:17 AM | Updated on Apr 19 2025 5:17 AM

MLC Kavitha Open Letter To CM Revanth Over Group 1 Recruitment: Telangana

ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలో పడిపోయాయని ఆమె ఆరోపించారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ‘తెలంగాణ యువతకు, ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి, అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపణీయం. గ్రూప్‌ –1 ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్‌ టికెట్‌ జారీ చేసిన టీజీపీఎస్సీ అధికారులు, మెయిన్స్‌ పరీక్షకు వేరే హాల్‌ టికెట్‌ జారీ చేశారు.

కొత్తగా జారీ చేసిన హాల్‌ టికెట్లతో మెయిన్స్‌ నిర్వహించడంపై మొదటి నుంచే అనేక సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే మెయిన్స్‌ పరీక్షల తంతు ముగించారు. బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి ? కొందరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారా? లేదంటే తర్వాత వారిని మధ్యలో చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొన్నది. జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమానాలున్నాయి.

కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉంటుందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైన విషయం నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ –1 నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’అని కవిత తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement