మోసం చేశామని టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి: కొలుసు పార్థసారధి | MLA Kolusu Partha Sarathy Strong Counter To TDP Charge Sheet | Sakshi
Sakshi News home page

మోసం చేశామని టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలి: కొలుసు పార్థసారధి

Mar 9 2022 7:59 PM | Updated on Mar 9 2022 9:26 PM

MLA Kolusu Partha Sarathy Strong Counter To TDP Charge Sheet - Sakshi

సాక్షి, తాడేపల్లి: అన్నపూర్ణ లాంటి ఆంద్రప్రదేశ్‌ను చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి నిప్పులు చెరిగారు. కేవలం టీడీపీ తాబేదార్లకు లాభం చేకూర్చేలా దోచుకున్నారని ధ్వజమెత్తారు. అయిదేళ్లలో చేసిన పాపానికి చంద్రబాబును జనం ఛీత్కరించినా సిగ్గురాలేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలు దేహీ అని ఆదుకునే పరిస్థితి కల్పించాడని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనపై టీడీపీ చార్జ్‌షీట్‌ వేయ్యడంపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు.

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత 90శాతం మేనిఫెస్టో అమలు చేసిన తమపై ఛార్జ్ షీట్ వేయడం హాస్యాస్పదమన్నారు.. అదీ ఈఎస్‌ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన దానిపై చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులకు కొలుసు పార్థసారథి సవాల్‌ విసిరారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకుపోయిన చంద్రబాబు సిగ్గులేకుండా చార్జ్ షీట్ వేస్తాడా అని ప్రశ్నించారు. 
చదవండి: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని

అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షన్నర మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. ‘ఆ రోజు ఎస్సీ, బీసీ, మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు. మేము వాళ్ళ అభ్యున్నతికి చట్టాలు చేసి రిజర్వేషన్లు ఇస్తే మాపై చార్జ్ షీట్ వేయడానికి సిగ్గులేదా..? అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదవారికైనా ఇళ్లస్థలం ఇచ్చావా..? జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదు. తుఫాను పరిహారం సైతం మీరు ఎగ్గొట్టలేదా..? ఏదన్నా చార్జ్ షీట్ వేయాల్సి వస్తే టీడీపీపై వేయాలి. 

ఎంతసేపు విధ్వంసం చేయడం తప్ప ఈ రాష్ట్ర బాగు కోసం ఏమైనా చేశారా..? మీ దోపిడీ మాఫియా కోసం ఆఖరికి మహిళా అధికారులను సైతం జుట్టుపట్టుకుని దాడి చేశారు. మీ అయిదేళ్ల అధికార మదంతో కాల్ మనీ వ్యవహారం నడిపిన విషయం ప్రజలు మర్చిపోలేదు. స్కోచ్‌ అవార్డుల్లో మొదటి స్థానం రావడం ఓర్వలేక ఈ చార్జ్ షీట్ నాటకం ఆడుతున్నారు. ఆఖరికి సీఎంఆర్‌ఎఫ్‌లో లంచాలు మేసిన మీరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారా..? 
చదవండి: ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు: సీఎం జగన్‌

మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు చూడలేదా...మీరు ఎలా గెలుస్తారు..? ఇక చంద్రబాబును అండమాన్ పంపాల్సిన అవసరం వచ్చినది అని వాళ్ళ పార్టీ వారే అనుకుంటున్నారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడే ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరం. చార్జ్ షీట్ కాదు మేము ప్రజల్ని మోసం చేశామని టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి క్షమాపణలు చెప్పాలి. తప్పకుండా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి...అప్పుడు చూద్దాం అచ్చెన్నాయుడు’ అని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేర్కొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement