
- అవినీతి మరకలను నిరూపిస్తే దేనికైనా సిద్ధం
- నా పరిధిలో ఉన్న అన్నింటిలో విచారణ చేసుకోండి
- మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
- అధికారుల బదిలీ సర్వ సాధారణం
హైదరాబాద్: తన పరిధిలో ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దీనికి సంబంధించి తన పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పొన్నం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. చిన్నస్థాయి నుంచి మంత్రిగా ఎదిగానని, తనపై వచ్చిన అవినీతి మరకలను నిరూప్తిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు.
తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని, తన దగ్గరున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకూ మంచి సంబంధాలున్నాయన్నారు. ఇలంబర్తికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అధికారుల బదిలీలు ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదన్నారు.
ఇదిలా ఉంటే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బదిలీ అయిన సంగతి తెలిసిందే. కొత్త కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం. 2024 జూన్ లో రోనాల్డ్ రోస్ ని పక్కన పెట్టి జీహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రాపాలి నియమించింది ప్రభుత్వం. ఐదు నెలల పాటు పనిచేయగానే అమ్రాపాలి ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2024 అక్టోబర్ లో బల్దియా బాస్ గా ఇలంబర్తిని నియమించారు.
ఆరు నెలలు పని చేయగానే ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇలంబర్తిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్( MAUD) సెక్రెటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు రావడం, దానికి ఇలంబర్తి అంశాన్ని లింకు పెట్టడంతో వివాదం పెద్దదిగా మారింది. దీనిపై పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వడమే కాకుండా అవినీతిని నిరూపించాలంటూ సవాల్ చేశారు.