
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్కు కార్యకర్తలే బలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
కాగా, మంత్రి దామెదర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల దయతోనే మాకు పదవులు వచ్చాయి. మా కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. సంక్షేమంతో పేదవాడిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.
అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ప్రతీఏటా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం ద్వారా రూ.580 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోంది. అయినా పేదల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తోంది.
అవసరం ఉన్న చోట డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటుతో పాటు 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలోని ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యింది. కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రికి మంజూరుకి అనుమతులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి పండుగను తీసుకువస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.