
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకానికి ఇది నిదర్శనం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఉపాధ్యాయులందరికీ వందనం. ఈ విజయాన్ని ప్రధాని మోదీ, ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాం. బీజేపీని విమర్శించిన వారికి ఇదొక గుణపాఠం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి.. బీజేపీని ఓడించాలని చూశారు. ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక వర్గానికి కొమ్ము కాసింది. నితీకి నిజాయితీకి నిదర్శనం ఈ విజయం. రాబోయేది బీజేపీ కాలమే. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలో పార్టీకి ఇది మూడో విజయం. కిషన్రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాం. తెలంగాణలో టీచర్లు అందరూ తపస్లో చేరాలి అని సూచించారు.