దొరికిపోయిన గజదొంగ | Kurasala Kannababu comment on Chandrababu | Sakshi
Sakshi News home page

దొరికిపోయిన గజదొంగ

Sep 4 2023 5:58 AM | Updated on Sep 4 2023 7:23 AM

Kurasala Kannababu comment on Chandrababu - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ ఐటీ శాఖే  నిగ్గు తేల్చినా పచ్చ మీడియా ఎందుకు కథనాలు రాయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. ‘చంద్రబాబు దొరికిన దొంగ.. గజదొంగ! చిన్న కాంట్రాక్టులోనే రూ.118 కోట్లు నొక్కితే 14 ఏళ్లు సీఎంగా బొక్కిందెంత? రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు కళ్లకు ఇవి కనిపించడం లేదా? ఈ బాగోతాన్ని రాయాలనిపించడం లేదా?’ అని నిలదీశారు. పవన్‌ కళ్యాణ్‌ లాంటి వ్యక్తి ఈ అవినీతిని ప్రశ్నిస్తారని తాను అనుకోవడం లేదన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు సొంత వదినే కాబట్టి ఆమె మాట్లాడటం లేదని, ఇక కమ్యూని­స్టులు ఎలాగూ స్పందించరని చెప్పారు. కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. 

తెహల్కా ఎప్పుడో చెప్పింది 
చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని, సచ్చిలుడినని కితాబు ఇచ్చుకుంటున్నారు. జాతీయ మీడియా కథనాలతో ఆయన ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారో బహిర్గతమైంది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబు షోకాజ్‌పై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు అందాయనడానికి వాట్సాప్‌ చాట్స్, ఈ–మెయిల్‌ ఆధారాలున్నాయని ఐటీశాఖ స్పష్టం చేసింది.

చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్ర­బాబు ఇంత డబ్బు నొక్కేశారంటే ఆయన ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు? ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పట్లేదు. ఆయన వందిమాగధులు, భజన బృందాలు స్పందించడం లేదు. ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్‌–2 సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేకపోయావు బాబూ? కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది.

చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడో 1999లోనే తెహల్కా చెప్పింది. ఓటుకు కోట్లు కేసు ద్వారా కూడా ఆయన వద్ద ఎంత అవినీతి సొమ్ము పేరుకు పోయిందో వెల్లడైంది. 

లోకేశ్‌ పాత్ర కూడా.. 
ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్‌ పేరు కూడా చెబుతున్నారు. చిన్నచిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్‌కు, మీకు ఉంది కదా! మీ అవినీతిని బహిర్గతం చేసిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు?  2014లో చంద్రబాబు 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు.

ఎన్నికలు కాగానే దాన్ని మాయం చేశారు. అధికారంలోకి వస్తానని ఆయనకే నమ్మకం లేదు. ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం ఏమిటి? గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి లాస్ట్‌ బాల్‌ అన్నట్లుగా చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అంటున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమిస్తారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement