అవసరం తీరగానే వదిలేస్తారా?.. కేసీఆర్‌పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు | Kunamneni Sambasiva Rao Sensational Comments On KCR BRS Party - Sakshi
Sakshi News home page

అవసరం తీరగానే వదిలేస్తారా?.. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం: కూనంనేని

Aug 24 2023 2:25 PM | Updated on Aug 24 2023 2:49 PM

Kunamneni Sambasiva rao Sensational Comments On KCr BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తు బ్రేకప్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ద్రోహం చేశారని మండిపడ్డారు. పొత్తు వీగినందుకు కేసీఆర్‌పై లెఫ్ట్ పార్టీల రాష్ట్ర నాయకులు పోటీ చేయాలని డిమాండ్ వచ్చిందన్న కూనంనేని.. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లిలో బలపైన పోటీ కచ్చితంగా ఉంటుందన్నారు.

అది తెలిసీ ఎందుకు ప్రపోజల్ పెట్టారు?
కంటివెలుగు, మునుగోడు సభకు పిలిచి మిత్రధర్మం పాటించారట.. లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉండి మిత్రధర్మం తప్పామట అంటూ బీఆర్‌ఎస్‌పై కూనంనేని  మండిపడ్డారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని కేసీఆర్‌కు ముందే తెలుసన్నారు. కూటమిలో ఉన్న విషయం తెలిసి కూడా ఒక సీటు ఇస్తామని, రెండు ఎమ్మెల్సీ ఇస్తామని ఎందుకు ప్రపోజల్ పెట్టారని ప్రశ్నించారు. ఏ రాజకీయం అయినా కొంతకాలమే నడుస్తుందన్నారు.

కేసీఆర్‌ మిత్రధర్మం తప్పింది వాస్తవా కాదా?
2004లో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) ఎందుకు కూటమి కట్టారని నిలదీశారు. ఆ సమయంలో కూటమిలో ఉంటూనే చాడ పోటీ చేసే స్థానంలో మరో వ్యక్తిని కేసీఆర్ పోటీలో పెట్టారని గుర్తు చేసిన కూనంనేని.. అప్పుడు మిత్రధర్మం తప్పినట్లు కాదా? అని ప్రశ్నించారు. 2009లో టీడీపీతో పొత్తులో ఉంటూ మిత్రధర్మం మళ్ళీ తప్పి సీపీఐ పోటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్ పెట్టారని ప్రస్తావించారు. 2004, 2009లో కేసీఆర్ ఉమ్మడి పోత్తులో ఉండి మిత్రధర్మం తప్పింది వాస్తవం కాదా ప్రశ్నించారు.
చదవండి: కేసీఆర్‌ నేర్పించిన విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా..

రాజకీయాలు కావాలి.. రాజకీయ విలువలు కాదు
‘అవసరం వస్తే మా దగ్గరికి వస్తారు.. అవసరం తీరిపోగానే వదిలేస్తారా?. కేసీఆర్‌కు రాజకీయాలు మాత్రమే కావాలి.. రాజకీయ విలువలు కాదు. రాజకీయ శవాలపై రాజసౌధం నిర్మించుకున్న నాయకుడు కేసీఆర్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లాంటి జిల్లాలో లెఫ్ట్ ప్రభావం ఉంటుందని, రాష్ట్రంలో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ బలంగా ఉంది. భవిష్యత్తులో కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నాం. మరింత బలంగా మేము తయారు అవుతాం. సమరశిల పోరాటానికి శంఖారావం పూరిస్తాం. గ్రామగ్రామన ప్రభుత్వ వైఫల్యాలను ఖండిస్తాం

సాయుధ పోరాటానికి పిలుపు
సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆగస్ట్ 15, 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదు. తెలంగాణకు స్వాతంత్రం కోసం సెప్టెంబర్ 11న పోరాటానికి పిలుపునిస్తే 17న హైదరాబాద్‌ను ఇండియాలో కలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సువర్ణ అక్షరాలతో లికించాల్సినది పోయి...తప్పుగా చిత్రీకరించారు. తెలంగాణ పోరాటం అనేది సాయుధ పోరాటంతో నాంది పలికి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలిపారు.

సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సభ
కాంగ్రెస్ ద్రోహులు అని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17పై కేసీఆర్ తన వైఖరి ఏంటో చెప్పాలి. సాయుధ పోరాటం వల్ల లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కింది. పోరాటంలో మరణించిన వాళ్ళు ముస్లింలు, హిందువులు ఉన్నారు. అసలు తెలంగాణ పోరాటం ఆనాడే పురుడుపోసుకొంది.సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపకపోతే అమరుల ఆశయాలను నిర్లక్ష్యం చేసినట్లే. సెప్టెంబర్ 11 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు జరుపుతున్నాం. సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సభ’ నిర్వహించనున్నట్లు కూనంనేని పేర్కొన్నారు. 
చదవండి: అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement