కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు | Kishan Reddy Comments On Central Government Schemes | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Nov 8 2024 5:57 PM | Updated on Nov 8 2024 6:31 PM

Kishan Reddy Comments On Central Government Schemes

నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం.

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్‌వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు.

‘‘నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా సమీక్షించుకోవాలి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.

రేపటి నుంచి పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ బీజేపీ సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలించనున్నాయి.  9, 11, 13 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశిలించనున్నారు. రేపు(శనివారం) ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి.

రేపు(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి, సూర్యాపేటలో లక్ష్మణ్‌, ఆదిలాబాద్‌లో యేలేటి మహేశ్వర్ రెడ్డి బృందాలు.. 11న కరీంనగర్, మహబూబ్ నగర్‌, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు సందర్శించనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో   బండి సంజయ్ బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశిలించనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, వరంగల్ జిల్లాలో ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్‌ రావు, ఖమ్మం కాటిపల్లి వెంకట రమణారెడ్డి బృందాలు పరిశీలించనున్నాయి. 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను  ధర్మపురి అరవింద్ బృందాలు సందర్శించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement