
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి, చేతులు దులుపుకుంది. వర్షాల వల్ల వైఎస్ జగన్ ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ నెల 11వ తేదీన వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.
ఈ విషయం తెలియగానే మళ్లీ మంత్రులు ప్రెస్మీట్ పెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కేవలం మాటలకే తప్ప చేతల పరంగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కొత్త హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు చూపే శ్రద్ధలో కనీసం రైతులను ఆదుకునేందుకు రూ.1000 కోట్లతో అయినా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేరా అని రైతులే ప్రశ్నిస్తున్నారు
సిండికేట్గా మారిన పొగాకు కంపెనీలు
రాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈ రోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు.

మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైఎస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.
రైతుల వేదన అరణ్య రోదన
రాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్ఫెడ్తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది.
రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
పట్టుబడిన బియ్యం వివరాలు బయటపెట్టండి
వైఎస్ జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ను వాహనాల ద్వారా ఇస్తే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. అందుకోసం ఆ వ్యవస్థను రద్దు చేసి, రేషన్ షాప్ల వద్దకే వెళ్ళాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండలకు రేషన్ కోసం వెళ్ళి క్యూలైన్లలో నిలబడి పేదలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో అక్రమంగా తరలిస్తున్న రైస్ను పట్టుకున్నారు.
ఎండీయు వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసిన తరువాత కూడా అక్రమంగా బియ్యం రవాణా ఎలా జరుగుతోందో చెప్పాలి. అలాగే పట్టుబడిన బియ్యంను మా ప్రభుత్వంలో వేలం వేసే విధానం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలా పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెడుతుందో తెలియడం లేదు. ఏడాది కాలంగా ఎంత బియ్యాన్ని పట్టుకున్నారు, ఆ బియ్యాన్ని ఎలా వేలం వేశారో వెల్లడించాలి.