Kuppam: టీడీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన

బాబులకే బాబు.. తారక్ బాబు
జూనియర్ ఎన్టీఆర్ జోలికొస్తే ఊరుకోం
వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై కుప్పంలో అభిమానుల నిరసన
కుప్పం(చిత్తూరు జిల్లా): ‘మీ రాజకీయాల్లోకి మా అభిమాన నేతను లాగి నానా యాగీ చేయడం బాగోలేదు. ఎన్టీఆర్ మాటల్లో పస లేదు.. దమ్ము లేదు.. కోపం లేదంటూ మీ ఇష్టాను సారం నోరు పారేసుకుంటారా.. ఇలా మీ అంతకు మీరే మాట్లాడుతున్నారా.. లేక ఇలా మాట్లాడాలని మీకు ఎవరైనా చెప్పారా.. ఇంకో సారిలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాబులకే బాబు మా తారక్ బాబు’ అని టీడీపీ నేతలపై సీనీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు చిత్తూరు జిల్లా కుప్పంలో నిప్పులు చెరిగారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై వారు ఆదివారం నిరసన తెలిపారు.
చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశిస్తూ దుర్భాషలాడారంటూ.. బాబు, టీడీపీ నేతలు నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్లో పసలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు జూనియర్ ఎన్టీఆర్పై విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఎం సినిమా థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్ఆర్ఎం థియేటర్ ఎదుట జూనియర్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివకుమార్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడిపై కుట్ర పూరితంగా చేస్తున్న విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు.