సాల్మన్‌ హత్య కేసులో చంద్రబాబే దోషి! | Jagan Strong Reaction Pinnelli Incident Other TDP Atrocities | Sakshi
Sakshi News home page

సాల్మన్‌ హత్య కేసులో చంద్రబాబే దోషి!

Jan 22 2026 12:52 PM | Updated on Jan 23 2026 5:20 AM

Jagan Strong Reaction Pinnelli Incident Other TDP Atrocities

అన్నీ చెడ్డ అలవాట్లున్న తప్పుడు మనిషి చంద్రబాబు.. మీరు నాటిన విషపు గింజలు విష వృక్షాలవుతాయి 

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్లిందో ఇదో ఉదాహరణ 

మా కార్యకర్తలపై దాడులపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం 

మళ్లీ మంచి రోజులు వస్తాయి.. గ్రామంలోకి పునఃప్రవేశం జరుగుతుంది  

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నిప్పులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ మూకలు సాగిస్తున్న రాక్షస దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళితుడు సాల్మన్‌ హత్య కేసులో చంద్రబాబే దోషి అని స్పష్టంచేశారు. ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో ఏ స్థాయికి పోయిందనటానికి ఇదో ఉదాహరణ. 

గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో సర్పంచ్, ముగ్గురు ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందినవారు. ఈ నలుగురితోపాటు 300 పైచిలుకు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి వెళ్లేలా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఊరిలో వారికున్న ఆస్తులు, పొలాలు అన్నింటినీ వదిలేసేలా దౌర్జన్యం చేసి గ్రామాన్ని వీడేలా సాక్షాత్తు చంద్రబాబునాయుడే ప్రోత్సహిస్తున్నారు. 

పోలీసు భద్రతతో పికెట్‌ ఏర్పాటుచేసి వారు గ్రామంలోకి తిరిగి వచ్చేలా ఆదేశించాలంటూ హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆ గ్రామాన్ని వీడి వెళ్లిపోయిన ఒక దళితుడు, పేదవాడు అయిన సాల్మన్‌ భార్య తన ఇల్లు చూసుకునేందుకు అక్కడకు వెళ్లింది. 

అయితే అనారోగ్యం బారిన పడి అక్కడే ఉండిపోవడంతో తన భార్యను చూడటానికి వెళ్లిన సాల్మన్‌పై దాడిచేసి రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. చంపేందుకు పావులుగా వాడిన వ్యక్తులకు, సాల్మన్‌కు ఎలాంటి గొడవలు లేవు. పైనుంచి చెప్పి అతడిని చంపించారు. ఈ హత్యలో సీఐ, ఎస్‌ఐలు, ఎస్పీ, చంద్రబాబునాయుడి ఎమ్మెల్యేలు, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు.. వీరంతా దోషులే.  

చంద్రబాబు ఓ తప్పుడు మనిషి ..!
ఈ మనిషి చంద్రబాబు.. నాయకుడు, పాలకుడు కాదు. అన్నీ చెడ్డ గుణాలు, చెడ్డ అలవాట్లున్న ఒక తప్పుడు మనిషి. భగవద్గీత చదివినా, బైబిల్‌ చదివినా, ఖురాన్‌ చదివినా దేవుళ్లు మనకు చెప్పిందేమిటి..? మోసం చేయకండి, అబద్ధం ఆడకండి.. నిజాయితీగా బతకాలని నేర్పిస్తారు. కానీ చంద్రబాబునాయుడుకున్న అలవాటు, తన కుమారుడికి నేర్పించిన అలవాటు.. చివరికి ఆయన పార్టీ వారికి కూడా చంద్రబాబు చెప్పేదేంటంటే.. దౌర్జన్యం చేయండి, మోసం చేయండి తప్పులేదు! 

అబద్ధాలు ఆడినా తప్పులేదు... వెన్నుపోటు పొడిచినా తప్పులేదు... అధికారమే ముఖ్యం..! ఇవీ ఆయన నేర్పించేవి! జరుగుతున్న పరిణామాలు కోర్టుల దృష్టికి తీసుకొస్తాం. ఎన్‌హెచ్‌ఆర్సీ(జాతీయ మానవ హక్కుల కమిషన్‌)కి కూడా ఫిర్యాదు చేస్తాం. కోర్టుల రక్షణ ద్వారా గ్రామస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. తిరిగి గ్రామంలోకి పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎల్లకాలం చంద్రబాబునాయుడు రోజులుండవు. ఇప్పటికే రెండేళ్లయిపోయింది. మరో మూడేళ్లు కూడా అయిపోతాయి. తర్వాత ఇదే చందబ్రాబునాయుడికి తాను వేసిన విత్తనాలు వృక్షాలైతే ఎలా ఉంటుందో తెలుస్తుంది.  

పాలకులుగా న్యాయం, ధర్మం వైపు నిలబడాలి 
దెబ్బలు తిన్న సాల్మన్‌ను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆరో రోజు మరణించాడు. చనిపోయిన ఆ మనిషిని సొంత గ్రామంలో ఖననం చేయడానికి కూడా గ్రామంలోకి వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలా అడ్డుకుంటారని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి బంధువులు, వేలమంది నిలదీస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలోకి ప్రవేశానికి అనుమతించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచించాలి. 

ఇలా చేసి తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే చంద్రబాబు వేసిన విషపు విత్తనాలు రేపు చెట్లు అవుతాయి. మీరు ఏవైతే నాటారో.. అవే పండుతాయి. నష్టపోయిన వారు చూస్తూ ఊరుకోరు. సహజంగా ఇది మానవ నైజం. పాలకులుగా ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. న్యాయం ధర్మం వైపు నిలబడాలి. పాలకులు న్యాయం, ధర్మం తప్పితే విషపు గింజలు నాటినట్లవుతుంది. రేపు ఎవరూ నియంత్రించలేని విధంగా ఆ విషపు బీజాలు చెట్లు అవుతాయి.   

గుర్తుపెట్టుకో బాబూ.. రేపు మా వాళ్లు నేను ఆపినా ఆగరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement