పక్కా ప్రణాళికతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి, ప్రభుత్వానిదే బాధ్యత: హరీష్‌రావు | harish rao Condemn Attack On Kaushik Reddy By Arekapudi gandhi | Sakshi
Sakshi News home page

మా సహనాన్ని అసమర్థతగా భావించొద్దు: హరీష్‌రావు

Sep 12 2024 2:01 PM | Updated on Sep 12 2024 5:10 PM

harish rao Condemn Attack On Kaushik Reddy By Arekapudi gandhi

సాక్షి, హైదరాబాద్‌: హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడిని మాజీ మంత్రి హరీష్‌ రావు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే  కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్‌  రెడ్డి నివాసం వద్ద హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఇదేం  ప్రజాస్వామ్యం, ఇదే ప్రజా పాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. 

తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిని ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ విద్రోహా, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. వెంటనే కౌశిక్‌ రెడ్డికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో కౌశిక్‌పై గాంధీ అనుచరుల దాడి హేయమని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

  • మా కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారు.

  • కాంగ్రెస్‌ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడి చేశారు.

  • వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తే దాడి చేశారు

  • ఎమ్మెల్యే అరికెపైడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

  • ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి చేశారు.

  • సీఎం రేవంత్‌ ప్రోద్భలంతోనే మా ఎమ్మెల్యేపై దాడి చేశారు

  • ఏసీపీ, సీఐలను వెంటనే సస్పెండ్‌ చేయాలి

  • హైదరాబాద్‌లో పట్టపగలే ఎమ్మెల్యేకు రక్షణ లేదు

  • ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏం ఉంటుంది

  • ఇది రేవంత్‌ ప్రభుత్వ వైఫల్యం

  • మీరు ఒకటి చేస్తే.. మేము రెండు చేయగలుగుతాం

  • అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు

  • మా సహనాన్ని అసమర్థతగా భావించొద్దు

  • రేవంత్‌ బాధ్యత లేని మనిషి

  • శాసన సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాద్యత స్పీకర్‌ది

  • కౌశిక్‌పై దాడి చేసిన వారిని జైలుకు పంపేదాకా బీఆర్‌ఎస్‌ పోరాడుతుంది

  • పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాహుల్‌ రాజీనామా చేయించాలి

  • కాంగ్రెస్‌ మోసాలను దేశం మొత్తం గమనిస్తోంది’ అని హరీష్‌ రావు పేర్కొన్నారు.

కాగా పీఏసీ కమిటీ చైర్మన్‌గా శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం.. ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరస్పర సవాల్‌-ప్రతిసవాల్‌ ఎపిసోడ్‌లో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయితే కౌశిక్‌ రెడ్డి ఇంటికే అరికెపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. 

అరికెపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ క్రమంలో.. అరికెపూడి అనుచరులు కౌశిక్‌ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్‌ రెడ్డి వర్గీయులు ప్రతిఘటనకు దిగడంతో.. ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి.  అక్కడితో ఆగకుండా అరికెపూడి వర్గీయులు రాళ్లు, టమాటాలను కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి.

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్‌
పరిస్థితి చేజారుతున్న క్రమంలో..  ఎమ్మెల్యే అరికెపూడిని, నలుగురు కార్పొరేటర్ల పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement