ఫాల్తూ మాటలు మాట్లాడితే ‘దేశద్రోహమే’

Govt will not hesitate to file sedition cases against Opposition: KTR - Sakshi

మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో కేసులు పెడతాం

మీడియాతో చిట్‌చాట్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

తెలంగాణ పురోగతి, ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం

సీఎంను దూషిస్తే పదింతలు సమాధానం ఇస్తాం

డ్రగ్స్‌తో నాకేం సంబంధం?

రక్తం, వెంట్రుకల పరీక్షకు కూడా సిద్ధమే.. రాహుల్‌ గాంధీ కూడా రెడీయా?

పీసీసీ అధ్యక్ష పదవి కొనుగోలు చేసిన వ్యక్తి టికెట్లు అమ్ముకోడా?

హుజూరాబాద్‌లో గెలుపు మాదే..

ఎంఐఎంకు భయపడేది బీజేపీనే...
కేంద్ర హోంమంత్రి దేశానికి ఏం చేస్తాడో చెప్పకుండా సెప్టెంబర్‌ 17 గురించి మాట్లాడుతున్నాడు. ఎంఐఎంకు బీజేపీనే భయపడుతోంది. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జనసంఘ్‌ పాత్ర లేకున్నా చరిత్రకు మతం రంగు పులిమి ఓట్లు వేయించుకొనే ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ ఎంపీల్లో ఒక్కరూ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు. చదవండి: బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి 

కేసీఆర్‌ నాయకత్వమే రక్ష...
కొత్త పార్టీలు వంద శాతం జాతీయ పార్టీల కొమ్ముకాస్తున్నాయి. తెలంగాణ సమాజం ఏకం కాకుండా చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కుళ్లబొడిచి తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేసీఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణకు టీఆర్‌ఎస్సే లైఫ్‌లైన్‌.

సాక్షి, హైదరాబాద్‌: ‘విపక్షాలు బఫూన్, బేవకూఫ్‌ మాటలు కట్టిపెట్టాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతి చిల్లరగాడూ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఎవరూ తాగుతలేరా? సమాజంలో తాగడం సాధారణ విషయం. ముఖ్యమంత్రి తాగితేనే లిక్కర్‌ అమ్మకాలు పెరిగాయా? ఊరూపేరు లేని వ్యక్తులు కేసీఆర్‌ను దూషిస్తుంటే సహించేది లేదు. ఉద్యమ సమయంలో అప్పటి ఉద్వేగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ మాట్లాడటంలో అర్థముంది. ఇక నుంచి మాపై చేసే విమర్శలకు పదింతలు తిరుగు సమాధానం ఇస్తాం. తెలంగాణ పురోగతి, ప్రతిష్టను దెబ్బతీసేలా ఫాల్తూ మాటలు మాట్లాడితే మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేపై కాంగ్రెస్‌ భాగస్వామ్య ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశద్రోహం కేసులు పెడతాం’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘నాకు, డ్రగ్స్‌కు సంబంధం ఉందని మాట్లాడుతున్న వాడు మనిషా, పశువా? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌కు ఎవరో ఏదో లేఖ ఇస్తే నాకేం సంబంధం. లెటర్‌ ఇచ్చిన వాడు ఒక బఫూన్‌. అయినా నా రక్తం, వెంట్రుకలతోపాటు అవసరమైతే లివర్‌ ముక్కను కూడా డ్రగ్స్‌ అనాలసిస్‌ పరీక్షకు ఇచ్చేందుకు సిద్ధం. రాహుల్‌ గాంధీ కూడా ఇందుకు రెడీయా?’అని సవాల్‌ విసిరారు.  చదవండి: Amit Shah: 2023లో మాదే అధికారం

సున్నాలు వేయడం నుంచి కన్నాలు వేసే వరకు..
‘కాంగ్రెస్‌ పార్టీ గజ్వేల్‌లో కాదు... మరో నూరు చోట్ల సభ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అందమైన ఆర్చీల ఫొటోలు పెట్టి ప్లాట్ల బేరం చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి కొనుక్కున్న వ్యక్తి పార్టీ టికెట్లు అమ్ముకునేందుకు మార్కెట్లో గిరాకీ ఉందని చూపెట్టుకొనేందుకు సభల పేరిట హడావుడి చేస్తున్నాడు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు రేవంత్‌రెడ్డి రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నట్లు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2018లో గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన ప్రతాప్‌రెడ్డి కూడా పెద్ద సభ పెట్టి కేసీఆర్‌ను దూషించినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. కేసీఆర్‌ను తాగుబోతు అంటూ చిల్లరగా మాట్లాడుతున్న వారి బట్టలు ఊడదీస్తాం. సున్నాలు వేసే స్థాయి నుంచి కన్నాలు వేసే స్థాయికి ఎదిగిన వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు విలాసవంతమైన బంగళాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అందరి బాగోతాలు వెలికితీస్తాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై చార్జిషీట్లు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘క్రిమినల్స్, రోజూ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్లకు మాత్రమే చార్జిషీట్లు తెలుసు’అని ఎద్దేవా చేశారు. సీఎం ఫాంహౌస్‌లో పడుకుంటేనే దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. 

కొత్త పార్టీలు కేంద్రాన్ని నిలదీయట్లేదేం? 
‘రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలు ఎందుకు ఏ కారణంతో వచ్చాయో తెలియదు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా ప్రశ్నించని వారు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ పొగిడిన మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌... కేంద్రం కొత్త జిల్లాలకు నవోదయ విద్యాసంస్థలు, ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వకపోయినా ఎందుకు మాట్లాడటం లేదు? 60 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ పాలనలో దళితులపై దాడుల గురించి మాట్లాడరు. వైఎస్‌ షర్మిల కూడా కేసీఆర్‌ మీదే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి. బీసీబంధు కోసం డిమాండ్‌ చేస్తున్న బండి సంజయ్‌ తొలుత ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీని కోరాలి. బండి సంజయ్‌కు ఓట్లు వేసినందుకు కరీంనగర్‌ ప్రజలు బాధ పడుతున్నారు’ అని కేటీఆర్‌ అన్నారు.  ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన గురించి కేటీఆర్‌ స్పందిస్తూ ‘నాకూ ఆడపిల్ల ఉంది. ఆ ఘటనపై బాధపడ్డా, కన్నీళ్లు పెట్టుకున్నా. చేయకూడని తప్పు చేస్తే తెలంగాణలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు కంటే వేగంగా శిక్ష పడుతుంది’అని పేర్కొన్నారు.  

నెలాఖరులోగా సంస్థాగత కమిటీలు: కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటును సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు నగర ప్రజాప్రతినిధులను, సీనియర్‌ నాయకులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో పార్టీ స్థానిక కమిటీల నిర్మాణం పూర్తయ్యిందని, నగరంలోనూ డివిజన్‌ కమిటీల నిర్మాణం సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు.

హైదరాబాద్‌లో పార్టీని అజేయమైన శక్తిగా మార్చేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎంతగానో దోహదపడుతుందని, ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. రాబోయే పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీతో పాటు నగర ప్రజాప్రతినిధులు, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

నువ్వో అడ్డగాడిదవి..
బ్లాక్‌మెయిల్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థల నుంచి డబ్బు సంపాదించేందుకే పీసీసీ అధ్యక్ష పదవిని కొనుగోలు చేసిన వ్యక్తి పార్టీ టికెట్లు అమ్ముకోవడం ఖాయం. సొంత పార్టీలోని సీనియర్‌ నేతలను గౌరవించలేని కుసంస్కారివి. ఐటీ రంగంలో తెలంగాణ బాగా పనిచేస్తోందని కితాబిచ్చిన పార్టీ ఎంపీని గాడిద అంటావా? నువ్వు అడ్డగాడిదవు, సంకర గాడిదవు.  –  రేవంత్‌పై కేటీఆర్‌ వ్యాఖ్య

ఢిల్లీ పార్టీల సిల్లీ రాజకీయం... 
‘మేం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తీరికలేకుండా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పనిలేక పాదయా త్రలు చేస్తున్నాడు. ఇక టీపీసీసీ కొత్త అధ్యక్షుడు నేనూ మార్కెట్‌లో ఉన్నా అని చెప్పుకొనేందుకు తంటాలు పడుతున్నాడు. విపక్షాలు న్యూసెన్స్‌కు ఎక్కువ విలువ ఇస్తూ నిర్మాణాత్మక పనులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాష్ట్రంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తప్ప మరో ఎన్నిక లేదు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందా? హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని యువకుడైన భగత్‌ ఓడించాడు. జానారెడ్డి కంటే ఈటల రాజేం దర్‌ పెద్దవాడు కాదు. ప్రజలు అభ్యర్థిని కాకుండా పార్టీని చూసి ఓట్లు వేస్తారు. హు జూరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలుస్తుంది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజి ట్లు కూడా రావు. ఢిల్లీ పార్టీలు సిల్లీ రాజకీయా లు చేస్తున్నాయి’అని కేటీఆర్‌ విమర్శించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top