
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 70 స్థానాలలో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తదితర నేతలు ఉన్నారు.
ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుందనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం ఈ రేసులో ఏడుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వారు ఎవరో? వారి రాజకీయ స్థితిగతులేమిటో ఇప్పుడు చూద్దాం.
1. ప్రవేశ్ సింగ్ వర్మ
ఈ జాబితాలో మొదటి పేరు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ వర్మ. ఆయన వరుసగా రెండు పర్యాయాలు పశ్చిమ ఢిల్లీ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇది ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విజయం. ఈసారి ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 4,099 ఓట్ల తేడాతో ఓడించారు.
ప్రవేశ్ సింగ్ వర్మకు చిన్నప్పటి నుంచి ‘సంఘ్’తో అనుబంధం ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. బీజేపీ తన వ్యూహంలో భాగంగా ప్రవేశ్ సింగ్ వర్మకు ఢిల్లీ అసెంబ్లీలో అవకాశం కల్పించింది. జాట్ వర్గానికి చెందిన ప్రవేశ్ సింగ్ వర్మను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రైతు ఉద్యమాన్ని అణగార్చేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చనే వాదన వినిపిస్తోంది.
2. మనోజ్ తివారీ
మనోజ్ తివారీ వరుసగా మూడోసారి ఈశాన్య ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈయన 2016 నుండి 2020 వరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. పూర్వాంచల్ ఓటర్లలో మనోజ్ తివారీకి ప్రజాదరణ ఉంది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటువంటి పరిస్థితిలో బీజేపీ మనోజ్ తివారీని ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
3. మంజీందర్ సింగ్ సిర్సా
మంజీందర్ సింగ్ సిర్సా 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ టికెట్పై విజయం సాధించారు. తరువాత రాజౌరి గార్డెన్ నుండి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2021లో శిరోమణి అకాలీదళ్ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజీందర్ సింగ్ సిర్సాకు సీఎంగా అవకాశం ఇవ్వడం ద్వారా పంజాబ్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుంది.
4. స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ 2010 నుండి 2013 వరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆమె మంత్రి అయ్యారు. ఆమె 2019లో రాహుల్ గాంధీని ఓడించారు. ప్రస్తుతం బీజేపీలో మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరు. స్మృతిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీజేపీ ఆ లోటును భర్తీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
5. విజేందర్ గుప్తా
రోహిణి అసెంబ్లీ స్థానం నుండి విజయేంద్ర గుప్తా వరుసగా మూడవసారి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పుడు, వారిలో ఒకరు విజేంద్ర గుప్తా ఒకరు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఈయన కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారని చెబుతున్నారు.
6. మోహన్ సింగ్ బిష్ట్
మోహన్ సింగ్ బిష్ట్ 1998 నుండి 2015 వరకు వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే, 2015లో ఆయన కపిల్ మిశ్రా చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. 2020లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2025లో బీజేపీ ఆయనను ముస్తఫాబాద్ నుండి పోటీ చేయించింది. ఆయన ఇక్కడి నుంచి కూడా విజయం సాధించారు.
7. వీరేంద్ర సచ్దేవా
వీరేంద్ర సచ్దేవా 2007 నుంచి 2009 వరకు చాందినీ చౌక్ జిల్లా అధ్యక్షునిగా, 2014 నుండి 2017 వరకు మయూర్ విహార్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. 2009 నుంచి 2012 వరకు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర మంత్రిగా, 2012 నుండి 2014 వరకు ఢిల్లీ బీజేపీ శిక్షణ ఇన్చార్జ్గా, జాతీయ బీజేపీ శిక్షణ బృందం సభ్యునిగా కూడా ఉన్నారు. ఆయన 2020 నుండి 2023 వరకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. వీరేంద్ర సచ్దేవా 2023లో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: వీరి వీడియోలు క్షణాల్లో వైరల్.. టాప్-10 భారత యూట్యూబర్లు