
వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు..
కోల్కతా: వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించారు. 'రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారతదేశం అంతటా సీఏఏ అమలు చేస్తామని నేను హామీ ఇవ్వగలను' అని బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలోని కక్ద్వీప్లో నిర్వహించిన బహిరంగ సభలో ఠాకూర్ మాట్లాడారు.
సీఏఏపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను శంతను ఠాకూర్ గుర్తుచేశారు. సీఏఏను అమలు చేయకుండా దేశంలో ఎవరూ ఆపలేరని అమిత్ షా గత డిసెంబర్లో అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు అంశాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెంగాల్ నుండి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. 2026లో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
పార్లమెంటు ఉభయ సభల్లో సీఏఏ బిల్లు 2019లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టంపై భారతదేశం అంతటా భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శులు చేశాయి.
ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ