
పెడన నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పెడన టిక్కెట్ను కాగిత కృష్ణప్రసాద్కు చంద్రబాబు ప్రకటించారు. తనకు సీటు దక్కక పోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పెడన టిక్కెట్ను కాగిత కృష్ణప్రసాద్కు చంద్రబాబు ప్రకటించారు. తనకు సీటు దక్కక పోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న వేదవ్యాస్.. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆయన కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో అస్వస్థతకు గురవ్వగా, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.
చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్ మండిపడ్డారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నా. ఈ సారి న్యాయం జరుగుతుందనుకున్నా. కానీ నాకు అన్యాయమే జరిగింది. చంద్రబాబు, పవన్ ను కలుస్తా.. నాకు జరిగిన అన్యాయంపై నిలదీస్తా. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.
జనసేనకు షాక్..
జనసేనకు ఆ పార్టీ నాయకులు షాకిచ్చారు. పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన టిక్కెట్ జనసేనకు ఇస్తారని ఆశపడ్డాం. బూరగడ్డ వేదవ్యాస్ను ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటిస్తారనుకున్నాం. మమ్మిల్ని మోసం చేశారు. మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.