Buragadda Veda Vyas
-
బూరగడ్డ భవితవ్యం ప్రశ్నార్థకం
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్వత్రిక ఎన్నికల్లో పెడన అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాగిత కృష్ణ ప్రసాద్కు టికెట్ కేటాయించడంతో చంద్రబాబును నమ్మి పార్టీలోకి వస్తే మరోసారి మోసం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వేదవ్యాస్ పెడన టికెట్ ఆశిస్తుండగా ఆయనకు కాకుండా కాగిత కృష్ణప్రసాద్కు చంద్రబాబు కేటాయించారు. దీంతో బూరగడ్డ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురయ్యారు. హై బీపీతో రెండు వారాల క్రితం హైదరాబాదు లోని ఆస్పత్రిలో చేరి, చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోని ఆయన విశ్రాంతిలో ఉన్నారు. వారసత్వంగా రాజకీయాల్లోకి.. బూరగడ్డ తండ్రి బూరగడ్డ నిరంజనరావు గతంలో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన వారసుడిగా వేదవ్యాస్ 1989లో కాంగ్రెస్ తరఫున కాగిత వెంకట్రావుపై గెలిచి అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందించారు. 2004 ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్గా చేశారు. 2009లో పెడన నియోజకవర్గం ఏర్పడింది. వేదవ్యాస్ ప్రజా రాజ్యం పార్టీలో చేరి, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్ సీపీ పెడన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టికెట్ లేదని తీవ్ర ఆందోళన 2018 వరకు వైఎస్సార్ సీపీలో ఉన్న వేదవ్యాస్ టీడీపీలో చేరారు. అప్పట్లో ఆయన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్గా చేశారు. 2019లో టీడీపీ నుంచి టికెట్ ఆశించినా.. 2024లో ఇస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పి దాటేశారని అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోవడంతో వేదవ్యాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కత్తివెన్ను మండలం చినపాండ్రక గ్రామంలో పర్యటనలో ఉండగా టికెట్ లేదని తెలిసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు అధికమై హైదరాబాదులోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అసంతృప్తిలో అనుచర వర్గం పెడన టీడీపీ టికెట్ కాగిత కృష్ణ ప్రసాద్కు ఇవ్వ డంతో వేదవ్యాస్ అనుచరులు చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ నాయకుడు పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ వచ్చారని, నమ్ముకొని ఉన్న నేతకు టికెట్ ఇవ్వకపోడం సరైంది కాదని చెబుతున్నారు. బాబు తీరు వల్లే తమ నాయకుడు అనారోగ్యానికి గురయ్యారని, తనను నమ్మిన నేతలను నట్టేట ముంచడం చంద్ర బాబుకు కొత్తేమీ కాదని అంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ కోసం పట్టు వచ్చే ఎన్నికల్లో పెడన నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని బూరగడ్డ అనుచరులు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఉన్న ఆయన నాలుగైదు రోజుల్లో ఇక్కడికి వచ్చి, తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవితవ్యం వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే, తమకు ఓటు బ్యాంకు ఉందని, గెలిచినా.. ఓడినా పోటీ చేసి ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో బూరగడ్డ ఉన్నట్లు అనుచరులు చెప్పుకొంటున్నారు. -
పెడన టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి.. వేదవ్యాస్కు హ్యాండిచ్చిన చంద్రబాబు..
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పెడన టిక్కెట్ను కాగిత కృష్ణప్రసాద్కు చంద్రబాబు ప్రకటించారు. తనకు సీటు దక్కక పోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న వేదవ్యాస్.. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆయన కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో అస్వస్థతకు గురవ్వగా, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్ మండిపడ్డారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నా. ఈ సారి న్యాయం జరుగుతుందనుకున్నా. కానీ నాకు అన్యాయమే జరిగింది. చంద్రబాబు, పవన్ ను కలుస్తా.. నాకు జరిగిన అన్యాయంపై నిలదీస్తా. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు. జనసేనకు షాక్.. జనసేనకు ఆ పార్టీ నాయకులు షాకిచ్చారు. పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన టిక్కెట్ జనసేనకు ఇస్తారని ఆశపడ్డాం. బూరగడ్డ వేదవ్యాస్ను ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటిస్తారనుకున్నాం. మమ్మిల్ని మోసం చేశారు. మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. -
‘బూరగడ్డ వేదవ్యాస్’ అవుట్
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేదవ్యాస్ను తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ద్వారా పొందిన ఈ నామినేటెడ్ పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్న వేదవ్యాస్ను రాజీనామా చేయాల్సిందిగా కోరినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం బలవంతంగా సాగనంపింది. ఈ మేరకు ముడా చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో నం.235ను జారీ చేసింది. ‘సాక్షి’ కథనంతో చలనం.. టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవులు చేపట్టి నేటికీ కొనసాగుతున్న వారిపై ‘పట్టుకుని వేలాడుతున్నారు’ అనే శీర్షికన గత నెల 28వ తేదీన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు పట్టుకుని వేలాడుతున్న పలువురు రాజీనామాలు చేశారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో సహా పలు దేవస్థానాల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మరికొంత మంది పదవీకాలం ముగియడంతో పక్కకు తప్పుకున్నారు. ఇంకొంత మంది ప్రభుత్వం ఎలాగూ తొలగిస్తుంది కదా అప్పుటి వరకు కొనసాగుదాం అన్న ధోరణిలో ఉన్నారు.కాగా పదవీకాలం ముగియడంతో కేడీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్కఫెడ్ చైర్మన్గా, డీసీఎంఎస్ చైర్మన్గా కొనసాగుతున్న కంచిరామారావులు తప్పుకోగా.. ఆయా సంస్థలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కే.మాధవీలతలు పర్సన్ ఇన్చార్జిలుగా ప్రభుత్వం నియమించింది. జూలై 28వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ మిగిలిన వారిలో గుబులు.. కాగా ముడా చైర్మన్గా మాత్రం వేదవ్యాస్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగారు. పైగా వారానికి రెండుమూడు రోజులు ముడా కార్యాలయానికి వచ్చి తమ తాబేదార్లకు పనుల కోసం అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చేవారు. వేదవ్యాస్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంకా నామినేటెడ్ పదవులు పట్టుకుని ఇంకా వేలాడుతున్న వారిలో గుబులు మొదలైంది. ఇంకా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో బండారు హనుమంతరావుతో సహా డైరెక్టర్లలు రాజీనామా చేయకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి పార్థసారథి, వేదవ్యాస్
భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికిన జగన్ సమాంధ్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమన్న నేతలు హైదరాబాద్: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన రోజు కూడా వైఎస్సార్ కాంగ్రెస్లోకి వలసల వరద కొనసాగింది. కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్థసారథి ఇటీవలి వరకూ రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాల విద్యా శాఖమంత్రిగా కొనసాగారు. అలాగే 2009 నుంచీ పీఆర్పీలో ఉన్న వేదవ్యాస్ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తరువాత అందులో కొనసాగుతున్నారు. కాంగ్రెస్కు రాజీనామాలిచ్చిన ఈ ఇద్దరు నేతలు శనివారం పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి వచ్చి పార్టీలో చేరారు. పార్థసారథి ఇంతకుమునుపే జగన్ను కలిసి తన అభీష్టాన్ని వెల్లడించారు. అందుకు అనుగుణంగా శనివారం వేదవ్యాస్తో కలిసి వ చ్చారు. వీరిద్దరికీ జగన్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ నివాసం పరిసరాలన్నీ కృష్ణాజిల్లా కార్యకర్తలతో కిటకిటలాడాయి. ‘జై జగన్...’ నినాదాలతో మారుమోగాయి. తనను కలుసుకోవడానికి ఉబలాటపడిన యువకులను నిరాశ పర్చకుండా జగన్ బయటకు వచ్చి వందలాది మందితో కరచాలనం చేసి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కృష్ణాజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్కుమార్, ఉయ్యూరు, కంకిపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు గోన మదన్, సాదిక్, ఉయ్యూరు చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ నెర్సు సతీశ్తో పాటు పలువురు ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు: పార్థసారథి రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని, ఆయన సారథ్యంలోనే పేదల కష్టాలు తీరతాయని విశ్వసిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి జరగాల్సి ఉందని, అది ఒక్క జగన్ నేతృత్వంలోనే సాధ్యమని అన్నారు. అందుకే తాను, తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలి: వేదవ్యాస్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, తాను కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నానని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రజలకు అవసరమన్నారు. వైఎస్ పథకాల అమలు చేయగలిగిన వ్యక్తి జగనేనన్నార -
వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి
-
వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్
హైదరాబాద్ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీమంత్రి పార్థసారధి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే డీజీపీ దినేష్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.