ట్రాన్స్‌జెండర్‌కు బీఎస్పీ టికెట్‌ | BSP fields a transperson first in Telangana | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్‌కు బీఎస్పీ టికెట్‌

Oct 31 2023 9:41 AM | Updated on Oct 31 2023 11:02 AM

BSP fields a transperson first in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కలి్పంచారు. వరంగల్‌ తూర్పు నుంచి చిత్రపు పుష్ప తలయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బరిలోకి దింపడం గమనార్హం. ఈ నెల 3న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా 43 మందితో కూడిన రెండో విడత జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 63కు చేరింది. 

ఆ పార్టీలవి మాయమాటలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌.. 
ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇతర రాజకీయ పారీ్టలు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. మాయమాటలతో వంచించే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని ప్రజలను కోరారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్‌ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. 

బీసీ కులాలకు చెందిన బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని ఆ పార్టీ... బీసీని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్‌ ధనబలం పనికిరాదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement