‘కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్‌ కుట్రలు’ | BRS Leader Harish Rao Slams CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్‌ కుట్రలు’

Jan 29 2026 3:41 PM | Updated on Jan 29 2026 7:11 PM

BRS Leader Harish Rao Slams CM Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలను కొనసాగిస్తుందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ను టచ్‌ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్‌ చేయడమేనన్నారు హఱీస్‌.  స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్‌ అని స్పష్టం చేశారు.  ఈ మేరకు హరీష్‌ ట్వీట్‌ చేశారు. 

‘కేసీఆర్‌పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు… అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు’ అని ట్వీట్‌లో మండిపడ్డారు.

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

 

Advertisement
 
Advertisement
Advertisement