పార్టీ మారిన భార్యకు విడాకులన్న ఎంపీ

BJP MP Saumitra Khan Says Will Send Divorce Notice - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్‌ సభ్యులు సౌమిత్రా ఖాన్‌ భార్య సుజాతా మండల్‌ ఖాన్‌ సోమవారం నాడు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాళ్‌లోని బిష్ణూపూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్‌ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. కోల్‌కతాలో టీఎంసీ నాయకులు సౌగతా రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ సమక్షంలో సుజాతా ఖాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. (యడియూరప్పకు పదవీ గండం తప్పదా?)

2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్‌ ఖాన్‌ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు. 

ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. ఇదే విషయమై సౌమిత్రా ఖాన్‌ను ప్రశ్నించగా, సుజాతా ఖాన్‌ పార్టీ మారినందున తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. ఇక ముందు తన భార్య తన సర్‌ నేమ్‌ను వాడుకోరాదని ఆయన చెప్పారు. (బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్‌ లేదు: పీకే)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top