‘సీఎం నితీష్ అందుకే ఆ వ్యాఖ్యలు చేశారు’
నితీష్ రిటైర్మెంట్ వ్యాఖ్యలపై స్పందించిన తేజస్వీ యాదవ్
పట్నా : తనకు ఇవే చివరి ఎన్నికలు అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. బీహార్ రాష్ట్రాన్ని సీఎం నితీష్ అభివృద్ధిపథంలో నడపలేరని ముందు నుంచే తాము చెబుతున్నామని, ఇనాళ్లకు ఆయనే ఆ నిజాన్ని ఒప్పకున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామనే విషయం ముందే గ్రహించి సీఎం నితీష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు.
(చదవండి : పూర్ణియా సభలో నితీష్ సంచలన ప్రకటన)
కాగా, గురువారం పూర్ణియా జిల్లా దాందహా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం నితీష్ మాట్లాడుతూ..బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. బిహార్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్( అక్టోబర్ 28, నవంబర్ 3) ముగియగా, చివరి దశ పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
(చదవండి : ‘నితీశ్ తలవంచక తప్పదు’)