
అన్నమయ్య జిల్లా: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. తాజాగా రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగింది. ఆకేపాడు గ్రామంలో భూములు ఆక్రమించారంటూ ఆకేపాటికి జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆకేపాటికి జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే దళితుల ఇళ్లు, షాపులు కూలదోసారని ప్రశ్నించిన ఆకేపాటిని టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే చర్యల్లో భాగంగా భూముల ఆక్రమణ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపింది.
ప్రజల పక్షాన ఉన్నందుకే నోటీసులు
తాను ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించినందుకే నోటీసులు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. తనకు ఎన్ని నోటీసులు ఇచ్చినా, వేధింపులకు దిగినా భయపడేది లేదని ఆకేపాటి స్పష్టం చేశారు. తన భూముల్లో ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్న ఆకేపాటి.. తాను విచారణకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. మీరేమి చేసుకున్నా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని ఎమ్మెల్యే ఆకేపాటి పేర్కొన్నారు.