తండ్రికి చేదోడుగా ఉండేందుకు వెళ్లి గాయం బారిన
చేతిలో చిల్లి గవ్వలేని నిరుపేద దంపతులు
ఆర్థిక సహాయం కోసం కాలనీవాసుల భిక్షాటన
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
రాయికల్: వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తండ్రి కష్టం చూడలేని ఆ యువకుడు కాస్త సహాయం చేద్దామని వెళ్లగా.. విధి వెక్కిరించి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాతలు ఆదుకోవాలని, తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన శామిల్, రాధ దంపతులు. వారికి విశాల్ ఏకై క కుమారుడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రికి ఆసరాగా ఉండేందుకు తండ్రితోపాటు గోడ కట్ చేసే పనికి వెళ్లాడు. అక్కడ విధి వక్రీకరించి.. గోడ కూలి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రోజుకు సుమారు రూ.25వేల చొప్పున ఖర్చవుతోంది. కూలీ పనిచేస్తేనే కుటుంబం గడిచే ఆ తల్లిదండ్రులకు విశాల్ వైద్య ఖర్చులు పెను భారంగా మారాయి. కాలనీలో అందరితో కలిసి అల్లారుముద్దుగా ఉండే విశాల్ను దక్కించుకునేందుకు కాలనీవాసులు స్వయంగా భిక్షాటన చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. దాతలు, మానవతాహృదయులు స్పందించి విశాల్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేయాలని తల్లిదండ్రులు, కాలనీవాసులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు 8008192221 నంబర్లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.


