బల్దియాలో పోలింగ్ శాతం భిన్నం
ఒకచోట 46, మరో చోట 87 శాతం
కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల స్పందన డివిజన్ల వారీగా విభిన్నంగా కనిపించింది. ఈసారి ఏ డివిజన్లోనూ 90 శాతం పోలింగ్ దాటకపోవడం గమనార్హం. 24వ డివిజన్లో 2,594 మంది ఓటర్లు ఉండగా, 1,214 మాత్రమే పోలింగ్ కావడంతో కేవలం 46.80 శాతం ఓటింగ్ నమోదయింది. 21వ డివిజన్లో 2,802 మంది ఓటర్లకు, 2,442 మంది ఓటును వినియోగించుకోవడంతో అత్యధికంగా 87.15 శాతం పోలింగ్ నమోదైంది. 16వ డివిజన్లో 3,080 మందికి 1,538 పోలింగ్తో 49.94 శాతం, 13వ డివిజన్లో 2,901 ఓట్లకు 2,335 పోలింగ్తో 80.49 శాతం, 29వ డివిజన్లో 2,654 ఓట్లకు 2,079 పోలింగ్తో 78.33 శాతం నమోదయింది.
డివిజన్ల వారీగా మారిన ఓటర్ల స్పందన
డివిజన్లలో ఇంత వ్యత్యాసం కనిపించడం విశేషం. ఎన్టీపీసీలోని పీటీఎస్, టీటీఎస్, ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ ప్రాంతాలు కలిగిన 24వ డివిజన్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల నిర్లక్ష్యం, వలసలు, స్థానిక సమస్యలపై అసంతృప్తి వంటి అంశాలు కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు లక్ష్మీపురం, వీర్లపల్లి, ఎఫ్సీఐ ఎల్కలపల్లిగేట్ ప్రాంతాలున్న 21వ డివిజన్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డివిజన్ల వారీగా నమోదైన పోలింగ్ శాతం ఆధారంగా ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అధిక పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.


