
ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గంజ్రోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అతిక్ (38) తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. అతిక్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో కాలుజారి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిగురుమామిడి: మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తు న్న జుట్టు స్వామి విషజ్వ రంతో సోమవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్వామి వారంరోజులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందాడు. అయినా జ్వరం తగ్గలేదని తెలిపారు.
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ (35) అనే వ్యక్తి ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి రాజశేఖర్ ఒంటరితనంతో బాధపడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి బందెల గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
రెండు ఆలయాల్లో చోరీ
వీణవంక: మండలంలోని కోర్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ ,పెద్దమ్మ తల్లి ఆలయాల్లో రెండున్నర తులాల బంగారం, 59తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. గ్రామస్తుడు పూదరి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
జగిత్యాలజోన్: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ.. వాహనాన్ని అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన 12 మంది మహిళలు రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి ఓ మినీటాక్సీలో వెళ్లారు. మోరపల్లి శివారులో డ్రైవర్ పరాంకుశంవంశీకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న తోట్ల గంగవ్వ అక్కడికక్కడే చనిపోయింది. మిగతావారు గాయపడ్డారు. దీనిపై బాధితురాలు రాధ ఫిర్యాదు మేరకు అప్పటి జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. సీఐ కృష్ణకుమార్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, కె. నరేశ్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో వంశీకృష్ణకు రెండేళ్ల జైలు, జరిమానా విధించారు.
● ఉద్యోగుల తీరుపై అనుమానాలు
వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్స్లాబ్పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్స్లాబ్పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి