
రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
● వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కారు
● నుజ్జునుజ్జయిన వాహనం.. వేలాడిన మృతదేహం
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ స్టేజీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం.. కరీంనగర్ నుంచి కొంగారి మృత్యుంజయ్ (32) భార్య, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. ముందున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపై కారు అదుపుతప్పింది. డివైడర్ అవతలివైను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సగం బస్సు కిందికి చొచ్చుకుపోయింది. డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్న మృత్యుంజయ్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు మత్యుంజయ్ హైదరాబాద్కు చెందిన వాడు. ఈయన ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం.
బహిరంగ ప్రదేశంలో కోడె టికెట్లు ?
● ఉద్యోగుల తీరుపై అనుమానాలు
వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్స్లాబ్పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్స్లాబ్పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇసుక వివాదం..
మెట్పల్లి రూరల్: ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కేశిరెడ్డి నవీన్రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు సోమవారం ఆత్మకూర్కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఉన్నారు.
సంఘటనా స్థలంలో
మృత్యుంజయ్ మృతదేహం
ఎలక్ట్రికల్ బస్సును ఢీకొన్న కారు

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం