● అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా
గౌరవాధ్యక్షురాలు వి.లక్ష్మి
గజపతినగరం: ఐసీడీఎస్ గజపతినగరం ప్రాజెక్ట్ పరిధి ఎస్ఎల్వలస సెక్టార్ రామన్నపేటలో పని చేస్తున్న మానాపురం సౌజన్యపై రాజకీయ వేధింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు వి.లక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు అంగన్వాడీ సిబ్బందితో కలిసి శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానాపురం సౌజన్యపై ఎటువంటి రిమార్కులు లేకపోయినా, కూటమి నాయకులు కావాలనే తొలగించారన్నారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించి ఉద్యోగం తెచ్చుకుని 14 నెలల తర్వాత జాయిన్ అయితే ఈనెల 7న మళ్లీ ఓ మెమో ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సౌజన్య 9 నెలల గర్భిణి అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం చేయని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎం.సుభాషిని, పి.జ్యోతి, రాములమ్మ, కొండమ్మ, ఉషారాణి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.


